ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. దీని కారణంగా పాశ్యాత్య దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. దీంతో దేశాలన్నీ స్వీయ నిర్భంధాన్ని ప్రకటించాయి. మన దేశంలోనే కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ బయటపడుతుండటంతో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు.
దీంతో రోజు వారి పనిచేసుకుంటేనే బ్రతుకు బండి నడిచే సామాన్యులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ కార్మికులు సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చైర్మన్గా సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటి) పేరుతో ఓ సంస్థని ప్రారంభించారు.
దీని ద్వారా పేద కళాకారులకు, ఇడ్డందుల్లో వున్న కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. దీని కోసం ముందుగా మెగాస్టార్ చిరంజీవి కోటి విరాళం ప్రకటించారు. నాగార్జున కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, ప్రభాస్ 50 లక్షలు, రామ్చరణ్ 30 లక్షలు. నాని 30లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, వరుణ్తేజ్ 20 లక్షలు, రవితేజ 20 లక్షలు, మహేష్ 25 లక్షలు, నాగచైతన్య 25 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష, శర్వానంద్ 15 లక్షలు, దిల్రాజు, శిరీష్ 10 లక్షలు, విశ్వక్సేన్ 5 లక్షలు, శ్రీకాంత్ 5 లక్షలు, కార్తికేయ 2 లక్షలు, సందీప్ కిషన్ 2 లక్షలు, బ్రహ్మాజీ 75 వేలు ప్రకటించారు. ఇలా ప్రకటించిన మొత్తం నేటికి 6 కోట్ల 2 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంత మొత్తాన్ని అందించిన వారందరికి పేరు పేరునహృదయ పూర్వక కృతజ్ఞలు తెలిపారు.