సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం నవంబర్ చివరి వారానికి పూర్తవుతుంది. ఎక్కువ సమయం వృధా చేయకుండా మహేష్ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడని అంటున్నారు. అయితే ఇంతవరకూ బానే ఉంది కానీ మహేష్ తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లి, పరశురామ్, సందీప్ రెడ్డి వంగ అంటూ పలువురి పేర్లు డిస్కషన్ లో ఉన్నాయి.
మరోవైపు సందీప్ రెడ్డి బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పరశురామ్ ఏమో అఖిల్ తో సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. వంశీ పైడిపల్లి గురించి ఎటువంటి సమాచారం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో షూటింగ్ తో బాగా బిజీగా ఉన్నాడు. ఇలా నలుగురూ క్లారిటీ ఇచ్చే పొజిషన్ లో లేని కారణంగా మహేష్ తర్వాతి చిత్రం ఎవరితో అనే ఉత్కంఠ మహేష్ అభిమానులలో నిండి ఉంది. అయితే మరికొన్ని రోజులు ఆగితే కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు.