నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఎక్కడా తగ్గడం లేదు. గత కొంత కాలంగా మీటూ వివాదంపై తమిళ ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం చేస్తోంది. ప్రముఖ పాటల రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో కెక్కిన చిన్మయి సీనియర్ తమిళ నటుడు రాధా రవిని కూడా వదలలేదు. దాంతో ఆమెని డబ్బింగ్ కళాకారుల సంఘం వెలివేసేలా రాధా రవి, గేయ రచయిత వైరముత్తు పావులు కదపడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
చిన్మయి మీటూ వ్యాఖ్యల కారణంగా ప్రముఖ గేయ రచయిత వైరముత్తు భారీ చిత్రం `పొన్నియన్ సెల్వన్` నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వార్తలు వినిపించాయి. వరుస కథనాలు ప్రచారం అవుతున్ననేపథ్యంలో తమిళ గేయ రచయితల సంఘం వైరముత్తుని స్వచ్ఛందంగా మణిరత్నం సినిమా నుంచి తప్పుకోవాలని కోరడం, దానికి వైరముత్తు సుముఖంగా స్పందించి వైదొలిగారని తాజాగా వార్తలు వినిపించాయి.
తాజాగా వైరముత్తుకు చెన్నైకి చెందిన ఓ యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట. డిషెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్లొన నున్నారని సదరు యూనివర్షిటీ వారు ఆహ్వాన పత్రాల్ని కూడా ప్రింట్ చేయించి ఇప్పటికే పంచేశారు. దీంతో ఆగ్రహించిన చిన్మయి ఆహ్వాన పత్రాన్ని ట్వీట్ చేస్తూ డిఫెన్ష్ మినిస్టర్ రాజ్నాథ్సింగ్ని సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసింది. 9 మంది మహిళల్ని మానసికంగా హింసించిన వ్యక్తికి ఎలా డాక్టరేట్ని ప్రధానం చేస్తారని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.