దేశ వ్యాప్తంగా `మీటూ` వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఎంతో మంది నటులు సినిమాల నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అదే స్థాయలో పలువురు రాజకీయ నాయకులు కూడా తమ పదవుల్ని పోగొట్టుకున్నారు. ఉత్తరాది వరకే పరిమితమైన ఈ సంఘటనలు దక్షిణాదిలోనూ కలకలం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్లో శ్రీరెడ్డి మీటూ వివాదంపై చేసిన రచ్చ ప్రకంపనల్ని సృష్టించింది. నడి వీధిలో బట్టలు విప్పి అర్థనగ్నంగా శ్రీరెడ్డి హల్చల్ చేయడంతో ఉమెన్ హెరాస్ మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యే కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో వివాదం కొంత చల్లారింది.
గత కొన్ని నెలలుగా తమిళ చిత్ర పరిశ్రమలోనూ మీటూ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రముఖ గేయ రచయిత వైరముత్తు గత కొంత కాలంగా 12 మంది సింగర్స్ని సెక్సువల్గా హెరాస్ చేశాడని, వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనని కూడా హెరాస్ చేశాడని గాయని, డబ్బింగ్ కళారారిని చిన్మయి చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్రపరిశ్రమతో పాటు టాలీవుడ్లోనూ సంచలనం సృష్టించాయి. ఈ మాటల్ని తాజాగా సీరియస్గా తీసుకున్న `పొన్నియన్ సెల్వన్` మేకర్స్ తమ ప్రాజెక్ట్ నుంచి అతన్ని తప్పించినట్టు తాజా సమాచారం. ఇదే నిజమైతే మీటూ కారణంగా సినిమా కోల్పోయిన తొలి దక్షిణాది కళాకారుడిగా వైరముత్తు రికార్డుల్లోకి ఎక్కడం ఖాయమని తమిళ వర్గాలు అంటున్నాయి.
ఇక వైరముత్తు `పొన్నియన్ సెల్వన్` నుంచి తప్పుకోవడం లాంఛనమే అయితే అతనిపై కొన్ని నెలలుగా ఒంటరి పోరాటం చేస్తున్న గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి విజయం సాధించినట్టే. అయితే దీనిపై ఇంకా సినీ వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. రచయితల సంఘం మాత్రం ప్రకటన చేసే అవకాశం వుందని మాత్రం తమిళ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.