సంక్రాంతి వేళా గుడివాడ కాస్త గోవాగా మారింది. సంక్రాంతి అంటే కోడి పందేలు , ఎడ్ల పందేలు , పేకాట ఇలా కొన్ని మాత్రమే తెలుసు కానీ ఈసారి అంతకు మించి అనేలా గుడివాడ లో క్యాసినో కల్చర్కు నాంది పలికారు. గోవాని తలదన్నే రీతిలో గుడివాడలో క్యాసినో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రచ్చ రచ్చ చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులో పెద్ద పెద్ద సెట్టింగులు పెట్టి మరీ జూద క్రీడలు జరిగిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
ఎవరికి వారే తగ్గేదే లేదంటూ మందేసి చిందేస్తూ క్యాసినో ఆడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మంత్రి కొడాలి నానికి చెందిన ‘కే’ కన్వెన్షన్లో సంక్రాంతి సంబరాలు పేరుతో అధికార పార్టీ నాయకులు కోడిపందేలు, గుండాట, పేకాటలకు తోడు కేసినో, తీన్పత్తి నిర్వహించారని.. భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేసి చీర్గాళ్స్ను తీసుకొచ్చి డ్యాన్సులు చేయించారని.. లోపలికి అడుగు పెట్టేందుకు రూ.10 వేలు ఎంట్రీ ఫీజుగా వసూలు చేశారని తెలుగు దేశం నేతలు ఆరోపిస్తున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా తన ట్విట్టర్ లో ‘గుడివాడలో యథేచ్ఛగా సాగుతున్న గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్. గోవాను తలదన్నే రీతిలో”క్యాసినో” ఏర్పాటుచేసిన మండపం ఎవరిది? ధాన్యానికి మద్దతుధర లేక, అమ్మిన వాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయాదందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యంఉందా?’ అంటూ ముఖ్యమంత్రి జగన్ను ట్యాగ్ చేయగా..‘’గోవా టు గుడివాడ’.. గోవాను తలదన్నే రీతిలో గుడివాడలో అన్ని హంగులతో పండగ స్పెషల్ “క్యాసినో” ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొడుతున్న గడ్డం గ్యాంగ్’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కొడాలి నాని కరోనా తో బాధపడుతూ..హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు.