ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనని అవమానిస్తున్నారని, కావాలనే కొంత మంది తన రాజకీయ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలని ఫన్నీగా కట్ చేసి వాటిని టిక్ టాక్లో పోస్ట్ చేస్తూ తనని ట్రోల్ చేస్తున్నారని, తనని ఆ వీడియోలతో అవమానిస్తున్నారని మండి పడ్డారు. అంతే కాకుండా తన ఫొటోలని కామెడీగా మార్ఫింగ్ చేసి వీడియోలు సృష్టిస్తున్నారని, వాటి ద్వరా తన పరువు తీస్తున్నారని వాపోయారు.
తనని ట్రోలింగ్ చేస్తూ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలు వీడియోలని వెంటనే స్పందించి తొలగించాలని ఈ సందర్భంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని పృథ్వీరాజ్ విజ్ఞప్తి చేశారు. గతంలో పృథ్వీరాజ్ తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్కు అధికార పార్టీ తరుపున చైర్మన్ పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు సినిమా అవకాశాలు కూడా ఎవరూ ఇవ్వడం లేదు.అధికార వైసీపీ కోసం పనిచేస్తున్నారని కొంత మంది నిర్మాతలు కావాలనే పృథ్వీని పక్కన పెడుతున్నారని, అవకాశాలు ఇచ్చిన చివరి నిమిషంలో ఆయనని తప్పిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.