కరోనా వైరస్ రోజురోజుకీ విస్తృతమవుతోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రపంచం మొత్తం భయం గుప్పిట్లో బతుకుతోంది. చైనా, ఇరాన్, ఇటలీలను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు ఇండియాలోనూ పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 100 దాటింది. ఇక రిపోర్ట్ కాని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో దాదాపుగా అన్ని స్కూళ్ళు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ బంద్ అయిన విషయం తెల్సిందే. యూరోప్ లో కూడా పరిస్థితి భయానకంగా ఉంది. సెలబ్రిటీలు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడుతున్నారు.
ఇటీవలే హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ మరియు అతని భార్యకు ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని టామ్ స్వయంగా తెలియజేసాడు. ఒక సినిమా పని మీద ఆస్ట్రేలియా వచ్చిన తనకు, తన భార్యకు ఈ వ్యాధి సోకినట్లు తెలిపాడు. అలాగే తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఏకాంతంగా గడుపుతున్నామని తెలిపాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా వైరస్ బారిన పడడం విషాదం. బాండ్ గర్ల్ అయిన ఓల్గా కుర్లెంకోకు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అని తేలిందట. క్వాంటమ్ ఆఫ్ సోలేస్ అనే బాండ్ సినిమాలో బ్యాండ్ గర్ల్ గా నటించింది ఈ హీరోయిన్. వారం రోజుల నుండి జ్వరం, ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చిందని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రస్తుతం ఏకాంతంగా గడుపుతున్నానని త్వరగా కోలుకుంటానన్న నమ్మకముందని ఆమె తెలిపింది.
కరోనా తమకు రాదు అనే భావన వద్దని, దాన్ని ప్రజలందరూ సీరియస్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాబట్టి ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వగైరా లక్షణాలు ఉంటే అలక్ష్యం చేయొద్దు. లక్షణాలు లేని వారు కూడా వీలైనంత జనాల్లోకి రాకపోవడం మంచిది.