టాలీవుడ్ కూడా ఓటీటీకి జైకొట్టాల్సిన సమయం వచ్చిందా? అంటే తాజా పరిస్థితులు ఇందుకు అద్దంపడుతున్నాయి. కరోనా దెబ్బతో ఇండస్ట్రీలన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. థియేటర్స్ బంద్ కావడం, షూటింగ్స్ లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అత్యంత ఇబ్బందకరంగా నిర్మాతల పరిస్థితి తయారైంది.
అంతా రెడీ చేసుకున్న సినిమా… డిస్ట్రిబ్యూటర్ల నుంచి అడ్వాన్స్లు తీసుకున్నాక దాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేని పరిస్థితులు ఎదురైతే ఆ నిర్మాత బాధ వర్ణణాతీతంగా మారింది. కరోనా మహమ్మారి ఎప్పుడు కట్టడి అవుతుందో తెలియదు. ఎప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడతాయో.. ఎప్పుడు థియేటర్లు మళ్లీ రీ ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. దీంతో బాలీవుడ్ టు కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ తమ సినిమాలని డైరెక్ట్గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్ని అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేయబోతోంది. కోలీవుడ్ చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ చిత్రాలు కూడా ఓటీటీల్లోనే రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఇటీవల టాలీవుడ్ నిర్మాతల్లో మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన కీలక చిత్రాల్లో ఓ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. 26 కోట్లు ఆఫర్ ఇచ్చారట. ఫైనల్ టాక్స్ జరుగుతున్నాయి. అవన్నీ మూడు నాలుగు రోజుల్లో ఓ కొలిక్కి వస్తే వెంటనే ప్రకటన చేస్తారని ఇండస్ట్రీ టాక్.