మెగాస్టార్ చిరంజీవి చైర్మన్గా కరోనా క్రైసిస్ చారిటీ మన కోసం (సీసీసీ) కు ప్రముఖ నిర్మాతలు మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి, మరియు ఎన్.వి.ప్రసాద్ 5 లక్షలు విరాళం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించిన నిర్మాత మోహన్ చెరుకూరి కూడా తన వంతు బాధ్యతగా సీసీసీకి 5 లక్షలు విరాళం అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత మోహన్ చెరుకూరి మాట్లాడుతూ `షూటింగ్లు లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినందనీయమని, అందులో తానూ భాగం కావాలనే ఉత్తేశ్యంతో తన వంతు బాధ్యతలగా ఈ విరాళం అందిస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కరోనా ఉధృతిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా తమ విధులను అహర్నిశలు నిర్వర్తిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా నిర్మాత చెరుకూరి మోహన్ అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ యంత్రాంగాలు చేస్తున్న కృషికి తగ్గట్లు పౌరులుగా మనందరం మన ఇంటికే పరిమితం కావాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మన వంతు పాత్రని పోషించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.