నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్ల క్రితం తను నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మొదలుపెట్టిన చిత్రం `నర్తనశాల`. సౌందర్య ద్రౌపది పాత్ర కోసం ఎంపిక చేశారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ మధ్యలో సౌందర్య మృతి చెందడం, ఆ తరువాత బాలయ్యకు ఈ చిత్రాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఆలోచన లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు.
అయితే 17 నిమిషాల నిడివిగల సన్నివేశాల్ని మాత్రం చిత్రీకరించారట. ఇన్నేళ్లకు ఆ సన్నివేశాలని రిలీజ్ చేయబోతున్నామంటూ సోమవారం సాయంత్రం బాలకృష్ణ ప్రకటించారు. ఈ నెల 24న విజయదశమి సందర్భంగా `నర్తనశాల`లోని ఈ సన్నివేశాలని ఎన్బికే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ప్లాట్ పామ్లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
`నాకు ఇష్టమైన చిత్రం నాన్నగారి `నర్తనశాల`. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలని ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరిక పై `నర్తనశాల` చిత్రానికి సంబంధించిన 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుకగా ఎన్బికె థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేస్తున్నాం. ఇందులో అర్జుడిగా నేను, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్బాబు గారు కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీకి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ల నుంచో `నర్తనశాల` సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది` అన్నారు బాలకృష్ణ.