నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తన శాల`. నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్ల క్రితం తను నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మొదలుపెట్టిన చిత్రమిది.. క్రితం లక్ష్మీపతి రాజు నిర్మాతగా బాలయ్య మరో భాగస్వామిగా ఈ చిత్రాన్ని రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్లో ప్రారంభించారు. కీలక పాత్రల్లో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్బాబు నటించారు.
అట్టహాసంగా ముహూర్తం జరిగింది. కొంత షూటింగ్ కూడా చేశారు. బాలయ్య తొలిసారి మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్గా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ అది అసాధ్యం అని తేలింది. సౌందర్య మృతితో ఈ మూవీ మేకింగ్ ఇక కష్టమనే సంకేతాలు వినిపించాయి. అందుకు తగ్గట్టే బాలకృష్ణ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశారు.
తాజాగా ఇన్నేళ్లకు 17 నిమిషాల ఫుటేజ్ని ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. దీంతో `నర్తనశాల` మళ్లీ వార్తల్లో నిలిచింది. తాజాగా మంగళవారం అర్జునుడిగా బాలయ్య ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. బాలయ్య లుక్ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారట.