రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం `రాజ్ దూత్`. రిలీజ్కు ముందు ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం రిలీజ్ తరువాత ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో మేఘాంశ్ ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రమే ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా తరువాత కొంత విరామం తీసుకున్న మేఘాంశ్ త్వరలో మరో చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రాన్ని సతీష్ వేగేశ్న తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో మేఘాంశ్తో పాటు దర్శకుడు సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్నహీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ రోజు దివంగత శ్రీహరి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని `రాజ్ దూత్` చిత్రాన్ని నిర్మించిన ఎం.ఎల్.వి. సత్యనారాయణ లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించబోతున్నారు.
ఇప్పటి వరకు కుటుంబ నేపథ్య చిత్రాలు చేశానని, తొలి సారి పూర్తి స్థాయి వినోదభరిత చిత్రంగా ఈ సినిమాని రూపొందించబోతున్నట్టు దర్శకుడు వేగేశ్న సతీష్ తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని కుదిరితే త్వరలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.