అడ్వాన్డ్గా ఆలోచించి 20 ఏళ్ల క్రితమే తన ఆలోచనల్ని సినిమాల రూపంలో తెరపైకి తీసుకొచ్చి అబ్బురపరిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. `ఆదిత్య 369` ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి దర్శకులు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు.
`ఆదిత్య 369`కు సీక్వెల్గా `ఆదిత్య 999` పేరుతో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ని సింగీతం ప్లాన్ చేశారని, అయితే దాన్ని బాలయ్య చేయడానికి ఆసక్తి చూపించినా చాలా వరకు మార్పులు చేయాలని చెప్పడంతో ఆ కథ ప్రస్తుతం హోల్డ్లోకి వెళ్లిపోయింది.
తాజాగా ఓ గాయని జీవిత కథని సిద్ధం చేసిన ఆయన ఆ కథని బయోపిక్గా మలచాలని సన్నాహాలు చేస్తున్నారట. మెంగళూరుకు చెందిన దేవదాసి నాగరత్నమ్మ కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరపైకి రానున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందట. అయితే ఈ చిత్రం కోసం ఇద్దరు క్రేజీ భామలు పోటీపడుతున్నట్టు లేటెస్ట్ న్యూస్.
ఇటీవలే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ అనుష్కకి ఈ కథని వినిపించారట. కథ నచ్చడంతో అనుష్క వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. అయితే అనుష్క ఒకవేళ తప్పుకుంటే మాత్రం సమంత చేయడానికి రెడీ అంటోందట. దేవదాసి గాయనిగా మారి ఆ తరువాత చివరి దశలో యోగినిగా శేషజీవితాన్ని ముగించిన ఓ యువతి కథ కావడంతో ఈ సినిమా కూడా తనకు `మహానటి` తరహాలో గుర్తింపుని తెచ్చిపెడుతుందని సామ్ భావిస్తోందిట.