నందమూరి బాలకృష్ణతో ఫైనల్గా ఓకే అనిపించుకున్నారు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. గత కొంత కాలంగా బాలయ్యతో ఓ సినిమా చేయాలని వుందని ప్రయత్నాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారని తెలిసింది. `పటాస్`తో ప్రయాణం మొదలుపెట్టిన అనిల్ ఆ తరువాత నుంచి వరుసగా హిట్లని సొంతం చేసుకుంటూ వచ్చారు. ఇటీవల మహేష్ తో చేసిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు.
ప్రస్తుతం `ఎఫ్2`కు సీక్వెల్ గా `ఎఫ్ 3` తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా విళయాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సమయాన్ని వెబ్ సిరీస్ కోసం కేటాయించిన అనిల్ రావి పూడి స్టార్ హీరో బాలయ్య కోసం ఓ టెర్రిఫిక్ స్టోరీని కూడా సిద్ధం చేశారట. అప్పట్లో దీనికి `రామారావు గారు` అనే టైటిల్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే బాలయ్యతో ఈ సినిమా చేయాలని ప్రయత్నించినా అనిల్ రావిపూడికి కాలం కలిసి రాలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు అనిల్ చెప్పిన లైన్ నచ్చి బాలయ్య ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానుందని, వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం వుందని తెలిసింది. ఇదిలా వుంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది.