తన రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ తో సూపర్ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు మూడో చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో పుష్పక విమానం చేసాడు ఆనంద్. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఒకటి తర్వాత ఒకటిగా వేగంగా సినిమాలు చేస్తోన్న ఆనంద్ తన నెక్స్ట్ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వంలో చేయనున్నాడు.
కొబ్బరి మట్ట చిత్ర దర్శకుడిగా సాయి రాజేష్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. అలాగే కలర్ ఫోటో చిత్రాన్ని కూడా నిర్మించాడు. కథ కూడా అందించాడు. మరోసారి దర్శకత్వ బాధ్యతలను చేపడుతున్నాడు. ఈ చిత్రానికి బేబీ అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో సూపర్ ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో హీరోయిన్ గా మారుతోంది. రీసెంట్ గా నాని టక్ జగదీష్ లో నానికు మేనకోడలు పాత్రను పోషించింది.
విరాజ్ అశ్విన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నారు. ఎస్కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సుకుమార్, అల్లు అరవింద్ లు ఈ చిత్ర ఓపెనింగ్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. త్వరలోనే చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.