బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగులో `సైరా నరసింహారెడ్డి` తరువాత మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోతున్నారు. `మహానటి` చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ 50వ వసంతంలోకి ఎంటరవుతున్న నేపథ్యంలో ఈ మూవీని నిర్మాత అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ కథతో తెరపైకిరానున్న ఈ మూవీకి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మెంటర్గా వ్యవహరించనున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే నటించబోతోంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం దీపిక 20 కోట్లు తీసుకుంటుండగా అమితాబ్ బచ్చన్ 25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని, ఆయనది అతిథి పాత్ర అని వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్బిది అతిథి పాత్ర కాదని, కథకు అత్యంత కీలకమైన పాత్ర అని ఇందు కోసం ఆయన 21 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని తాజాగా బాలీవుడ్ మీడియా కథనం. వర్కింగ్ డేస్ తక్కువ కాబట్టి బిగ్బి ఈ మొత్తానికి అంగీకరించినట్టు చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించి పారితోషికాలకే నిర్మాత దాదాపు 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. వచ్చే ఏడాది ప్రారంభః కానున్న ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.