గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఏది చేసినా పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తూ వెళుతుంటారు. `అల వైకుంఠపురములో` చిత్రం `ఇండస్ట్రీ హిట్గా నిలవడానికి అల్లు అరవింద్ మాస్టర్ ప్లానే ప్రధానంగా పనిచేసింది. అల హిట్ కావడంతో అల్లు క్యాంప్ ఆనందంలో మునిగితేలుతోంది. ఇదే సమయంలో అల్లు అరవింద్ తన కొత్త బిజినెస్ని ప్రారంభించేశారు.
అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ భారతీయ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. వీటిల్లో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ 5 దక్షిణాదిలో పగా వేసేశాయి. ఇకపై మరింతగా మార్కెట్ని విస్తరించుకోవాలని ప్లాన్ వేస్తున్నాయి. ఈ క్రమంలో అల్లు అరవింద్ సొంతంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ని `ఆహా` పేరుతో మొదలుపెట్టేశారు.
దీని ప్రచారం కోసం క్రేజీ హీరో విజయ్ దేవరకొండని రంగంలోకి దింపేశారు. `ఆహా` డిజిటల్ యాప్ ప్రచార కర్తగా విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారు. అతనికి సంబంధింని పబ్లిసిటీ హోర్డింగ్స్ హైదరాబాద్ సిటీతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. యువతలో భారీ క్రేజ్ వున్న విజయ్ దేవరకొండ కారణంగా యూత్ `ఆహా` యాప్కి ఎడిక్ట్ కావడం ఖాయం అన్నది అల్లు అరవింద్ ప్లాన్.. అది ఎంత వరకు ఫలిస్తుందన్నది వేచి చూడాలి.