మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మైహోమ్ రామేశ్వరరావుతో కలిసి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ ఫామ్ `ఆహా`. ఓటీటీ రంగంలో దీన్ని పతాక స్థాయిలో నిలబెట్టాలని, దక్షిణాదిలోనే నెంబర్ వన్ ఓటీటీ ప్లాట్ ఫామ్గా దీన్ని తీర్చి దిద్దాలని ప్లాన్ చేశారు. కానీ ఆచరణలో మాత్రం ఆ స్థాయిలో విజయాల్ని సాధించలేకపోతున్నారు. లాక్డౌన్ పిరియడ్ని వాడుకోలేకపోయిన `ఆహా` కోసం అల్లు అరవింద్ కొత్త ప్లాన్ వేశారు.
ఇప్పటికే వెబ్ సిరీస్ల కోసం స్క్రిప్ట్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా వంశీ పైడిపల్లి, చంద్రసిద్ధార్ధ, నందినిరెడ్డి వంటి దర్శకులతో కమిటీని ఏర్పాటు చేసిన అల్లు అరవింద్ కొత్త సినిమాలని, వెబ్ కంటెంట్లని మార్చడం మొదలుపెట్టారు. తాజాగా `ఆహా`కు మరింత ఊపుని, క్రేజ్ని తీసుకురావడం కోసం నాగచైతన్య నటిస్తున్న `లవ్స్టోరీ` మూవీ డిజిటల్ రైట్స్ని భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలిసింది.
సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. మరో 15 రోజుల షూటింగ్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ చిత్రం `ఆహా`లో స్ట్రీమింగ్ కానుందట. తెలంగాణ అమ్మాయి కథగా `ఫిదా` చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల `లవ్స్టోరీ` చిత్రాన్ని కూడా అదే నేపథ్యంలో తెరపైకి తీసుకొస్తున్నారు.