కమర్షియల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా తనదైన సెన్సిబిలిటీస్ని జోడించి ఫీల్గుడ్ చిత్రాల్ని అందిస్తుంటారు శేఖర్ కమ్ముల. `ఫిదా` హిట్తో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం `లవ్స్టోరీ`. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని `హేయ్ పిల్లా..`అంటూ సాగే ఓ సాంగ్ వీడియోని ప్రివ్యూగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో చైతూ. సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ వీడియోపై ప్రసంశలు కురుస్తున్నాయి.
ఈ వీడియోని చూసిన అక్కినేని నాగార్జున. సమంత కూడా సోషల్మీడియా ట్విట్టర్ వేదికగా చాలా అద్భుతంగా వుంది, చై అత్యంత సహజంగా కనిపించాడని ప్రశంసలు కురిపించారు. యూట్యూబ్లో ఈ వీడియో వైరల్గా మారి ట్రెండింగ్ అవుతోంది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్ దక్కడం ఆకట్టుకుంటోంది. సహజంగా శేఖర్ కమ్ముల సినిమా అంటే అందరిలోనూ ఆసక్తి వుంటుంది. ఆయనకు తోడు రౌడీ బేబీ సాయిపల్లవి, నాగచైతన్య తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా వుంటే తొలి వీడియో ప్రివ్యూ కు విశేష స్పందన లభిస్తుండటం, ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతుండటంతో ఆనందానికి లోనైన హీరో నాగచైతన్య దర్శకుడు శేఖర్ కమ్ములకు ఖరీదైన కానుకని ఇచ్చాడు. బ్లాక్ స్పెట్స్ బహుమతిగా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. బహుమతి అందుకున్న శేఖర్ కమ్ముల మరో గిఫ్ట్ని కూడా రెడీ చేసుకో అని చెప్పడం ఆకట్టుకుంటోంది.