దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని రకాల సినిమాలు, సీరియల్స్,రియాలిటీ షోలు అన్ని రకాల వినోద కార్యక్రమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. అసలే లాక్ డౌన్ పేరుతో ఇంటిలో ఉండే జనాలకు ఏదో ఒక రకంగా వినోద కార్యక్రమాలు ప్రసారం చేసి, వారిని ఎంగేజ్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు ప్రసారమాధ్యమాల పైన పడింది. వార్తలకు సంబంధించిన ప్రచార మాధ్యమాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోవిడ్ 19 మరియు కరోనా వైరస్ కు సంబంధించి అప్డేట్ మాత్రమే ఇస్తున్నారు. ఇక దూరదర్శన్ మొదలుకొని అన్ని రకాల పెద్ద పెద్ద మీడియా సంస్థల వరకు గతంలో తమకు రికార్డు స్థాయిలో టి.ఆర్.పి లు అందించిన షో లు, సీరియల్స్ ను మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నాయి. దూరదర్శన్ వారు ఇప్పటికే రామాయణం మహాభారతం తో పాటు “జాసూస్ విజయ్” మరియు సి.ఐ.డి సిరీస్ లను ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
ఇక ఆ తర్వాత ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ఎపిసోడ్లను కూడా మళ్లీ రీ టెలికాస్ట్ చేస్తున్నట్లు స్టార్ మా యాజమాన్యం ప్రకటించింది. ఇక బుల్లితెరపై కామెడీ పండిస్తున్న జబర్దస్త్ ఇలాంటి షోలు ఇప్పటికే ఒక రెండు వారాల పాటు ఎపిసోడ్లను బ్యాకప్ పెట్టాయి. కానీ ఆ తర్వాత నుంచి అయినా పాత ఎపిసోడ్లను ఈ టెలికాస్ట్ చేయవలసి వస్తుంది.
ఇక ఇప్పటికే తమ అభిమాన సీరియల్స్ ప్రసారం కావడం లేదని మహిళా ప్రేక్షకులు కొంచెం అసహనానికి గురవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే దేశంలో జనానికి సమాచారం,వినోదం మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో మరియు యుద్ధ ప్రాతిపదికన సామాజిక బాధ్యత, నైతిక ప్రవర్తన, మరియు విపత్తులు, సంక్షోభం వచ్చినప్పుడు ప్రజల నైతిక బాధ్యత మరియు ప్రవర్తన పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియా సంస్థల మీద ఉంది. ఇప్పటికైనా ఆ పరంగా దృష్టిపెట్టి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆశిస్తున్నాం.