బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఆమె ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీతో కలిసి చేస్తున్న `గంగూభాయి కతియావాడి` టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. యూట్యూబ్లో ఈ టీజర్ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`లో రామఖచరణ్కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
నటిగా ఇంతగా బిజీగా మారిన అలియాభట్ తాజాగా తాను నిర్మాతగా మారుతోందట. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వరుస చిత్రాల్లో నటిస్తూ తాను బిజీగా ఉన్నప్పటికీ ఆమె కొత్తగా నిర్మాతగా మారబోతోంది. తను నిర్మాతగా మారడమే కాకుండా మొదటి చిత్రం కూడా ప్రకటించబడింది.
తన ట్విట్టర్లో అలియా ఇలా రాసింది, `నేను నిర్మాణ సంస్థని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్పై మీకు కథలు చెప్తాము. సంతోషకరమైన కథలు. వెచ్చని, గజిబిజి కథలు. నిజమైన కథలు. టైమ్తో సంబంధంలేని కథల్ని చెప్పబోతున్నాం`అని ట్విట్ చేయడమే కాకుండా ప్రొడక్షన్ కంపనీ లోగోని పోస్ట్ చేసింది అలియాభట్.
నిర్మాతగా అలియా తొలి చిత్రం పేరు ‘డార్లింగ్స్’ . ఈ చిత్రాన్ని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ రెడ్ చిల్లీస్తో కలిసి నిర్మించబోతోందట. జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కలిసి నటించనున్నారు.