స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రవిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలొ బన్నీ మార్కు యాక్షన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని విజేతగా నిలిపి ఇండస్ట్రీ హిట్ అనిపించింది.
బన్నీ విభిన్నమైన యాక్టింగ్, మాటల మాంత్రికుడి మాటల గారడీకి తోడు తమన్ అందించిన సంగీతం కూడా తోడవ్వడంతో ఈ సినిమా టాప్ వన్ ప్లేస్లో నిలిచింది. ఈ చిత్రం కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ` సామజ వరగమన..`. యువ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అందించిన `రాములో రాముల..` పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది. యూట్యూబ్లో ఈ రెండు పాటలు హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటడం ఓ రికార్డుగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలకు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ప్లాట్ ఫామ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం.
తాజాగా పాన్ ఇండియా స్థాయిలో వున్న ప్రఖ్యాత మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్లో `అల వైకుంఠపురములో` చిత్ర గీతాలు టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతుండటం రికార్డుగా ఆదిత్య వారు చెబుతున్నారు. ఇంతటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తమ సంస్థ ద్వారా రిలీజ్ చేసే అవకాశాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని, హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్లకు కృతజ్ఞతలు అని ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్త తెలిపారు. ఈ చిత్ర గీతాలు ఇప్పటికీ జియో సావన్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ప్లాట్ ఫామ్స్లో టాప్ 1, 2 స్థానాల్లో కొనసాగుతుండటం విశేషం.