పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `ఆదిపురుష్`పై షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ముంబైలో మొదలైంది. ముందు మోషన్ క్యాప్షర్ టెక్నాలజీతో చిత్రీకరణ మొదలుపెట్టారు.
ఇందు కోసం ముంబైలోని గోరేగావ్ స్టూడియోలో భారీ సెట్ని నిర్మించారు. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్టయిన రోజే ఈ సెట్ అగ్నికి ఆహుతి అయిపోయింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగటంతో సెట్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. సెట్లో చెలరేగిన మంటల్ని అదుపు చేయడానికి 8 ఫైరింజన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక ట్యాంకర్ శ్రమించాయి. సెట్లో ప్రభాస్తో పాటు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంతా అన్నారు.
అయితే ఇది ప్రమాదం కాదని, ఈ ప్రమాదంలో కుట్రకోణం కూడా వుందని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. సైఫ్ అలీఖాన్ ఇటీవల ఈ మూవీలో తన పాత్ర గురించి వివరించిన తీరు నచ్చకే కొంత మంది ఈ ప్రమాదాన్ని సృష్టించారని, దీని వల్లే సెట్ తగలబడిపోయిందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అన్నది మేకర్స్ వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.