నిన్న విడుదలైన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళ క్లాసిక్ జిగర్తాండకు దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి అవసరమైన మసాలాలు అద్ది మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చాడు. ఇందులో విలన్ ఛాయలున్న వరుణ్ తేజ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి అతను క్రూరంగా మారడానికి గల రీజనింగ్ కూడా ఇచ్చాడు. ఇదంతా బానే వర్కౌట్ అయింది కానీ అక్కడ సిద్ధార్థ్ చేసిన రోల్ ను ఇక్కడ మనకు ఏ మాత్రం తెలియని తమిళ నటుడు అధర్వ చేత చేయించాడు హరీష్.
అసలు తెలియని ముఖం కావడంతో చాలా ముఖ్యమైన ఈ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. గద్దలకొండ గణేష్ చిత్రంలో ఈ పాత్రే వీక్ లింక్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగువారికి తెలిసిన ముఖాన్ని పెట్టి ఉంటే ఆ ఎఫెక్ట్ ఇంకొంచెం బాగుండేదని అంటున్నారు. మరి దర్శకుడు హరీష్ శంకర్ ఎందుకని అధర్వనే ఈ రోల్ కి తీసుకున్నాడనేది అతనికే తెలియాలి.