కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. తొలి దశ వైరస్తో పోలిస్తే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెంది కేవలం మూడు రోజుల్లోనే సోకిన వారిని మృత్యుఒడికి చేరుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు సినీ రంగంలోనూ విలయాన్ని సృష్టిస్తోంది.
కరోనా కారణంగా తాజగా తమిళ ఇండస్ట్రీకి చెందిన హాస్య నటుడు పాండు (74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయనని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. నటుడు పాండుకు భార్య కుముద, ముగ్గురు కుమారులు వున్నారు.
ఇదిలా వుంటే పాండు భార్య కూడా కరోనాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా వుండటంతో ఆమెకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే వుందని తెలిసింది. హాస్య నటుడు పాండు మృతి పట్ల తమిళ చిత్ర వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.