మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే స్ట్రైక్ కు సంబంధించిన సీన్స్ ను చిత్ర బృందం షూట్ చేసారు. ఇక ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడన్న వార్త తెలిసిన దగ్గరనుండి అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఇటు మెగా స్టార్ ఫ్యాన్స్ కానీ ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఆరోజు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. హోలీ సందర్భంగా మార్చ్ 9న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మహేష్ బాబు ఈ సినిమాలో నటించనున్నాడన్న వార్త కూడా బహిర్గతం చేయనున్నారని సమాచారం. నిజానికి ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ ను తర్వాత విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనుకోకుండా పొరబాటున టైటిల్ రివీల్ చేసేయడంతో ఇక అధికారికంగా ప్రకటన చేయడం ఉత్తమమని భావిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ను జూన్ కల్లా పూర్తి చేసి సినిమాను ఆగష్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందులో మహేష్ పాత్ర 30 నిమిషాల పాటు కనిపిస్తుందని అందులో మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ 15 నిమిషాల పాటు ఉంటాయని, ఆ సీన్స్ నిజంగా అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ కు కనులపండుగగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజులు ఆగితే దీనికి సంబంధించిన క్లారిటీ మనకు రావొచ్చు.
కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. త్రిష కథానాయిక.