తెలుగు చిత్ర సీమలో నటిగా, దర్శకురాలిగా దివంగత నటి విజయనిర్మలకు ప్రత్యేక స్థానం వుంది. తొలి లేడీ డైరెక్టర్, శతాధిక చిత్రాలని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న ఆమె గత ఏడాలి జూన్ 29న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు విజయనిర్మల జయంతి. ఈ సందర్భంగా నానక్ రామ్ గూడాలోని ఆమె నివాస ప్రాంగణంలో విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని ఆమె భర్త, నటుడు, సూపర్స్టార్ కృష్ణ గురువారం ఆవిష్కరించారు.
అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో మహేష్, నమ్రత, కృష్ణంరాజు, ఆయన భార్య శ్యామల, నరేష్, హీరో సుధీర్బాబు దంపతులు, గల్లా జయదేవ్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కణలో పాల్గొన్న హీరో సూపర్స్టార్ మహేష్ భావోద్వేగానికి లోనయ్యారు. తను గొప్ప వ్యక్తని, ఇప్పటికీ అమెని తమ కుటుంబం ఎంతో మిస్సవుతోందని అన్నారు.
ఈ పందర్భంగా మహేష్ మాట్లాడుతూ ` నాకు తెలిసినంత వరకు విజయనిర్మల గొప్ప వ్యక్తి. నా సినిమాలు విడుదలైనప్పుడు మార్నింగ్ షో చూసి నాన్న ఫోన్ చేసి అభినందించే వారు. ఆ వెంటనే విజయనిర్మల అభినందించేది. ఇటీవల `సరిలేరు నీకెవ్వరు` విడుదలైన రోజు నాన్న ఫోన్ చేసి అభినందించారు. ఆ వెంటే ఆమె నుంచి ఫోన్ వస్తుందనుకున్నాను. తరువాత ఆమె లేదని తెలిసి బాధపడ్డాను. ఈమె లేని లోటు మాలో అలాగే వుండిపోయింది` అన్నారు.