కరోనా వైరస్ యావత్ చిత్ర పరిశ్రమని స్థంభింపజేసింది. కరోనా దెబ్బకు షూటింగ్లు లేవు.. సినిమా రిలీజ్లు లేవు. చాలా వరకు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా వున్నాయి. మార్చి చివరి వారంలో రిలీజ్కు సిద్ధమైన చిత్రాలన్నీ కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి. లాక్డౌన్ విధించడం, భౌతిక దూరం వంటి కారణాల వల్ల సినిమాలు ఇప్పట్లో థియేటర్లలో రిలీజ కావడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టిజిటల్ ప్లాట్ ఫామ్స్ రిలీజ్కు సిద్ధంగా వున్న సినిమాల నిర్మాతలకు గాలం వేయడం మొదలుపెట్టాయి. భారీ ఆఫర్లు చూపిస్తూ టెమ్ట్ చేస్తున్నాయి. చాలా వరకు చాలా మంది ఓటీటీల ఆఫర్లకు తలొగ్గడం లేదు. కానీ కొంత మంది మాత్రం ఓటీటీలో రిలీజ్కు రెడీ అవుతున్నారట. ఇదిలా వుంటే తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న `మాస్టర్` చిత్రానికి ఓటీటీలు భారీ ఆఫర్ని ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారట.
ఇక ధనుష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ `జగమే తంత్రం` చిత్రానికి కూడా భారీగానే ఆఫర్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. లాక్డౌన్ పొడిగింపుతో అది సాధ్యపడలేదు. దీంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ వరుస కథనాలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఓటీటీలో తమ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని చిత్ర బృందం ప్రకటించింది.