నితిన్ హీరోగా నటించిన చిత్రం `భీష్మ`. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్కు `భీష్మ` తరుగులేని విజయాన్ని అందించి మళ్లీ సక్సెస్ బాటపట్టించింది. దీంతో చిత్ర యూనిట్ పై దర్శకుడు, హీరోపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతున్న చిత్ర యూనిట్ మంగళవారం ఆసమ్ సక్సెస్ పేరుతో సక్సెస్ మీట్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్ రాజు `భీష్మ` టీమ్పై ప్రశంసలు కురిపించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను చెప్పినట్టే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్హిట్ చేసి చూపించారని, తొలి సినిమా `ఛలో`తో హిట్ ని సొంతం చేసుకున్న వెంకీ ఇప్పుడు రెండో సినిమాతో సూపర్హిట్ కొట్టాడని, త్వరలోనే హ్యట్రిక్ హిట్కు రెడీ అవుతున్నాడని అభినందించారు.
దర్శకుడి విజన్ పర్ఫెక్ట్గా వుంటే `భీష్మ`కు వచ్చిన ఫలితమే వస్తుందని, వెంకీ కుడుములని పొగడ్లల్లో ముంచెత్తారు. రష్మిక గురించి మాట్లాడుతూ `ఆమెలో ఎనర్జీ మామూలుగా లేదని, హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్ చేస్తోందని, అద్భుతంగా నటిస్తోందని అభినందించారు. నితిన్తో చేసిన `శ్రీనివాసకల్యాణం`తో హిట్ కొట్టాలని ప్రయత్నించామని, కానీ కుదరలేదని, సినిమాలో మంచి కామెడీ ఉండి కంటెంట్ వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ప్రతిరోజు పండగే, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు నిరూపించాయని, ఇప్పుడు `భీష్మ` కూడా అదే విషయాన్ని నిరూపించిందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకు బాగా ఎంజాయ్ చేస్తున్నారని వెల్లడించారు.