మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా విడుదలైన గడ్డలకొండ గణేష్ చిత్రం సాధించిన విజయంతో యమా ఖుషీగా ఉన్నాడు. విడుదలకు ముందు టైటిల్ విషయంలో ఈ చిత్రానికి వివాదం ఏర్పడినా టైటిల్ మార్పు కారణంగా అంతా సవ్యంగా జరిగి మొత్తానికి హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా ఆశాజనకంగా ఉండడంతో వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడినట్లే.
రీసెంట్ గా వరుణ్ తేజ్, లక్ష్మి మంచు హోస్ట్ గా ఉన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ షోలు తన గురించి అందరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలని రివీల్ చేసాడు. తన జీవితంలో ఒక సంఘటన గురించి ప్రస్తావించి, తాను ఫ్యామిలీలో అందరినీ ఎంతలా భయపెట్టిందీ చెప్పాడు.
“నా తప్పు లేకపోయినా ఒకసారి నాన్న నన్ను తిట్టారు, అప్పుడు కొంచెం కోపం వచ్చినా వెంటనే పోయింది. అయితే ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది. పొద్దున్న లేచి చూసేసరికి నాన్న దగ్గరనుండి, పెదనాన్న చిరంజీవి గారి దగ్గరనుండి, బాబాయ్ కళ్యాణ్ గారి దగ్గరనుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా కంగారు పడిపోయారు. ఇంటికి వెళ్ళగానే నన్ను కొడతారు అనుకున్నా. అయితే అలాంటిదేం జరగలేదు. వాళ్ళు చాలా భయపడిపోయారు. అనవసరంగా వాళ్ళని భయపెట్టినందుకు బాధపడ్డా” అని చెప్పుకొచ్చాడు వరుణ్.