టాలీవుడ్లో వున్న యంగ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మినిమమ్ గ్యారెంటీ చిత్రాల హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అతనితో సినిమా అంటే ప్రొడ్యూసర్లకు మంచి నమ్మకం ఏర్పడింది. దీంతో హీరోగా అతనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ ప్రకారమే వరుణ్తేజ్ వరుస ప్రాజెక్ట్లని అంగీకరిస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాల్నితన ఖాతాలో వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వరుణ్తేజ్ `ఎఫ్3` చిత్రానికి 12 నుంచి 13 కోట్లకు తన పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. విక్టరీ వెంకటేష్తో కలిసి వరుణ్ తేజ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ఎఫ్ 2. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి నిర్మించిన ఈ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. దీంతో ఈ చిత్రానికి `ఎఫ్ 3` పేరుతో సీక్వెల్ని ప్లాన్ చేశారు. డిసెంబర్ రెండవ వారం నుంచి ఈ సీక్వెల్ని స్టార్ట్ చేస్తున్నామంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవలే ప్రకటించారు.
అయితే వరుణ్తేజ్ భారీగా డిమాండ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ దిల్ రాజు మాత్రం వరుణ్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేశారట. ఈ సీక్వెల్ కోసం హీరో వెంకటేష్కు 12 నుంచి 13 కోట్లు పారితోషికం ఇవ్వబోతున్నారట. అదే మొత్తాన్ని వరుణ్తేజ్కు కూడా ఇస్తానని దిల్ రాజు తాజాగా ప్రామిస్ చేసినట్టు తెలిసింది. దీంతో డిసెంబర్ రెండవ వారంలో `ఎఫ్ 3` పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.