శరత్ఖుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్కుమార్ టాలీవుడ్ దర్శకులకు హాట్ ఫేవరేట్గా మారుతోంది. ఆమె తెలుగులో కీలక పాత్రల్లో నటించిన చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో ఆమె డేట్స్ కోసం తెలుగు దర్శకులు క్యూ కడుతున్నారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` చిత్రంలో జయమ్మగా నటించి వరలక్ష్మీ ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన విషయం తెలిసిందే.
ఆ తరువాత అల్లరి నరేష్ సీరియస్ పాత్రలో నటించిన `నాంది` చిత్రంలోనూ అతన్ని కాపాడే లాయర్ పాత్రలో వరలక్ష్మీ అదరగొట్టింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించడంతో వరలక్ష్మీ శరత్కుమార్ టాలీవుడ్ దర్శకులకు హాట్ ఫేవరేట్గా మారిపోయింది. తాజాగా ఆమెకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం మెగాస్టార్తో `ఆచార్య` చిత్రాన్ని చేస్తున్న కొరటాల శివ ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. జీఏ2 పిక్చర్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు, మిక్కినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులోని కీలక పాత్ర కోసం కొరటాల ఇటీవలే వరలక్ష్మీ శరత్కుమార్ని సంప్రదించారట, పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.