ఒక హిట్టు పడిందంటే హీరో, డైరెక్టర్ మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. దాన్ని కొనసాగిస్తూ మరో మంచి హిట్ కోసం ఆ కాంబినేషన్ ప్రయత్నిస్తూ వుంటుంది. ఇప్పుడు అదే పనిలో వున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో మహేష్. ఈ ఇద్దరి కలయికలో ఇటీవల `మహర్షి` వచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తరువాత మరోసారి మహేష్, వంశీ పైడిపల్లి కలిసి పనిచేయబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథని సిద్ధం చేసే పనిలో వున్న వంశీ పైడిపల్లి `మహర్షి`సినిమా నుంచి మహేష్ ఫ్యామిలీని మాత్రం వదలడం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇటీవల క్రికెట్ మ్యాచ్ కోసం వెళితే అక్కడా ప్రత్యక్షమైన వంశీ పైడిపల్లి తాజాగా మహేష్ ఇంట్లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సందడి చేయడం పలువురిని ఆకర్షించింది. కొంత మంది సెటైర్లు వేస్తే మరి కొంత మంది నెటిజన్స్ మరో మంచి సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ మాత్రం కెమిస్ట్రీ వుండాలిగా అని మిర కొంత మంది వంశీ పైడిపల్లిని సపోర్ట్ చేస్తున్నారు.
మహేష్ ప్రస్తుతం `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లేడీ సూపర్స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.