రామ్చరణ్ సినిమాల్లో బిజీగా వుంటుంటే ఆయన సతీమణి ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పలువురిని ఆకట్టుకుంటోంది. ఇటీవల మూగజీవాల పరిరక్షణ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టి ఇందు కోసం `వైల్డెస్ట్ డ్రీమ్స్` పేరుతో తమ నివాసంలోనే ఫొటో ఎగ్జిబిషన్ని ప్రారంభించి అందరి చేత శభాష్ కపుల్ అనిపించుకున్నారు. ఇటీవల రామ చిలుక, కృష్ణ జింకల రక్షణ కోసం ముందుకొచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖకు యోగా పాఠాలు అందిస్తూ మళ్లీ వార్తల్లో కెక్కారు.
సోషల్ మీడియా ట్విట్టర్ , ఇన్స్టా గ్రామ్లో నిత్యం అభిమానులకు అందుబాటులో వుంటూ వస్తున్న ఉపాసన తాజాగా `నిన్ను నువ్వు ప్రేమించుకో` అంటూ చేపిన ట్వీట్ వైరల్గా మారింది. అందులో భాగంగానే పోలీసులకు యోగా పాఠాలు నేర్పడం ఆసక్తికరంగా మారింది. యోగా గురువు ఎడ్డీ స్టెర్న్తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. న్యూయార్క్ కు చెందిన ఎడ్డి స్టెర్న్కి మోగాలో మంచి పేరుంది. మైసూర్ స్కూల్ ఆఫ్ యోగాలో అష్టాంగమాన్ని అభ్యసించారాయన. వేదాలు చదివారు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. పుస్తకాలు కూడా రాశారాయన.
నిత్యం అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వర్తంచే పోలీసులు ఫిట్గా వుండాలని, అందుకు వారికి యోగా అవసరమని గుర్తించిన ఉపాసన అపోలో ఫౌండేషన్తో కలిసి పోలీసులకు యోగా పాఠాలు నేర్పించడం ఆసక్తిగా మారింది. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారి అంజనీకుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.