దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్టు షూటింగ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చినా కరోనా మాత్రం కనికరించడం లేదు. భయభ్రాంతులకు గురిచేస్తోంది. టీవీ సీరియల్స్పై దీని ప్రభావం తీవ్ర స్థాయిలో వుంది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పలు టీవీ సీరియల్స్ హడా విడిగా షూటింగ్ ప్రారంభించాయి. అంతా బాగానే వుంది అనుకుంటున్న సమయంలో నటుడు ప్రభాకర్కు కరోనా సోకింది.
ఆ తరువాత అతనితో సన్నిహితంగా వున్న కృష్ణ అనే నటుడికి కూడా పాజిటివ్ అని తేలడంతో టీవీ ఇండస్ట్రీ వణికిపోయింది. సీరియల్స్ షూటింగ్ ఆపాల్సిందేనా అని అంతటా చర్చ మొదలైంది. తాజాగా ఓ సీరియల్లో కీలక పాత్ర పోషిస్తున్న నటి నవ్యా స్వామికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. `స్టార్ మా`లో `ఆమె కథ`, ఈటీవీలో `నా పేరు మీనాక్షి` వంటి పాపులర్ సీరియల్స్లో నవ్యా స్వామి టైటిల్ పాత్రల్లో నటిస్తోంది.
ఈటీవీ కోసం `నా పేరు మీనాక్షి` సీరియల్ షూటింగ్ చేస్తుండగా అనుమానం వచ్చి ఛానల్ సిబ్బంది నవ్యకు కరోనా టెస్ట్ చేయించారట. ఆ టెస్టులో నవ్యకు పాజిటివ్ రావడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ఈ సీరియల్లో ఆమెతో కలిసి గత రెండు వారాలుగా పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక సిబ్బంది కూడా కరోనా టెస్టులకు వెళ్లినట్టు తెలిసింది. వరుసగా ముగ్గురు కరోనా బారిన పడటంతో టీవీ ఇండస్ట్రీ బెంబేలెత్తిపోతోంది.