టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రధమంగా వినిపించే పేరు తమన్. అంతగా బిజీ అయిపోయారాయన. గడచిన పదేళ్ల కాలంలో రాకెట్ స్పీడుతో సెంచరీ సినిమాలని పూర్తి చేసిన తమన్ అవన్నీ ఒకెత్తు త్రివిక్రమ్తో చేసిన `అల వైకుంఠపురములో` ఒకెత్తు అంటున్నారాయన. అఫ్కోర్స్ అది కూడా నిజమే అనుకోండి. ఎందుకంటే ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు ఆరేంజ్లో వున్నాయి కాబట్టి. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా తొలి రోజు తొలి షో నుంచే వరుస రికార్డుల్ని తిరగరాస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం 19న వైజాగ్లో విజయోత్సవ సభని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్రాంతి రేసులో ఎలాగైనా గెలవాలని ఆరు నెలల పాటు మానసికంగా, శారీరకంగా శ్రమించామని, దాంతో బ్రెయిన్ కొంచెం చిక్కిపోయిందని, బన్నీ, త్రివిక్రమ్ల వల్లే ఈ సినిమా ఆల్బమ్ ఈ స్థాయిలో వచ్చిందని వెల్లడించారు తమన్.
ఈ భూగ్రహంలోనే అత్యంత కూలెస్ట్ డైరెక్టర్ ఎవరైనా వున్నారంటే అది త్రివిక్రమ్ మాత్రమేనని, ఆయనతో సినిమా చేయడానికి తనకు పదేళ్లు పట్టిందని, అందుకే పదేళ్లకు సరితూగే పాటల్ని ఈ సినిమాకు ఇచ్చానని చెప్పుకొచ్చారు. సాధారణంగా సైకిల్ ట్యూబ్లు పంక్చర్ అవ్వడం చూసుంటారు కానీ ఈ సినిమా పాటలతో ఏకంగా యూట్యూబ్ పంక్చర్ అయ్యింది. ఇండియాని కాపాడటానికి బోర్డర్లో సైనికులు వున్నారు. మన తెలుగు భాషను కాపాడే ఒకే ఒక్క సోల్జర్ త్రివిక్రమ్. ఆయన అమ్మలాంటి మనిషి. ఈ సారి వంద కాదు వెయ్యి మిలియన్ వ్యూస్ కొడతాం` అని తమన్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.