సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అప్పుడే రైళ్లని పునరుద్దరించొద్దని ప్రధానిని కోరినట్టు తెలిసింది. దశల వారీగా ప్రయాణికుల రైళ్లని నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్పుడే రైళ్లని పునరుద్దరించొద్దని విజ్ఞప్తి చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారెంటైన్ చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా వుందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలి పోయేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనాతో కలిసి బ్రతకడం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం వుదన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా వైరస్కు జూలై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యారని, అయితే భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్త చేశారు. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు.