నిర్మాతగా, దర్శకుడిగా, సినీ కార్మికులకు ఎలాంటి అవసరం వున్నా నేనున్నానంటూ ముందుండి సమస్యల్సి పరిష్కరిస్తుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి నిర్మాత. రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్పై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మధాత, దత్తపుత్రుడు, డాక్టర్ బాబు వంటి తదితర చిత్రాలు నిర్మించారు.
కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు లెనిన్ బాబు చనిపోయారు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని కార్మికులకు అండగా నిలుస్తుంటారు. ఎన్నో హిట్ చిత్రాలని అందించారు. మొదటి నుంచి వీరి కుటుంబానిది వామపక్ష భావజాలం.
తన తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, తనని ఓదార్చడానికి తన మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కారోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తనని కలవడానికి ఇంటికి ఎవరూ రావద్దని తమ్మారెడ్డి వెల్లడించారు.