మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ ను 22న నిర్వహించబోతున్నారు.
18వ తారీఖు హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఈవెంట్ జరిగేది ఓపెన్ గ్రౌండ్ లో కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా నాలుగు రోజులు వెనక్కి జరిపారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుకున్న 18వ తారీఖున ఆడిటోరియంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
సైరాలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది. రామ్ చరణ్ నిర్మాత.