డిజిటల్ రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. ఇండియాలో ఇప్పటి వరకు డిజిటల్ ప్లాట్ ఫామ్లు ఎన్నో వున్నా దక్షిణాది నుంచి అందులోనూ తెలుగు నుంచి మొదలైన మొట్టమొదటి ఓటీటీ `ఆహా` అల్లు అరవింద్, మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కలిసి ఈ డిజిట్ ప్లాట్ ఫామ్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. వినోదం కోసం ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ఓటీటీల బిజినెస్ ఇండియాలో గణనీయంగా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. ఆ కోవలో `ఆహా` కూడా పోటీ పడుతోంది.
స్టార్ డైరెక్టర్లని సైతం దీని కోసం దించేసింది. ఇప్పటికే `ఆహా` కోసం దర్శకుడు క్రిష్ చేసిన `మస్తీస్` మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. త్వరలో దీనికి పార్ట్ 2ని చేయబోతున్నారు. అల్లు అర్జున్తో త్రివిక్రమ్ `ఆహా` ప్రమోషన్ కోసం ఓ యాడ్ ఫిల్మ్ని కూడా రూపొందించారు కానీ ఇంత వరకు రిలీజ్ చేయలేదు. త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే `ఆహా` కోసం సుకుమార్, వేణు ఊడుగుల, సుధీర్వర్మ వెబ్ సిరీస్లు చేయడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు `బాషా` ఫేమ్ సురేష్కృష్ణ కూడా ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారని తెలిసింది. లాక్ డౌన్ తరువాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నట్టు సమాచారం.