మొదట సురేష్ బాబు నిర్మిస్తోన్న వెంకీ మామ, దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలని భావించాడు. అయితే వెంకటేష్ కు గాయమవడంతో షూటింగ్ ఆలస్యమైంది. తర్వాత దీపావళి అని, క్రిస్మస్ అని ముందుకు తోసుకుంటూ వెళ్లి ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించాడు. సురేష్ బాబు సంక్రాంతి రేసులోకి దిగాడంటే కచ్చితంగా అది పెద్ద సినిమాలకు దెబ్బే.
ఎందుకంటే సురేష్ బాబు చేతిలో ఎంతకాదన్నా 400 థియేటర్లు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు అది కచ్చితంగా మైనస్ అవుతుంది. అందుకనే దిల్ రాజు, చినబాబు ఇద్దరూ సురేష్ బాబుకు ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏంటంటే వెంకీ మామను సంక్రాంతి రేసులోంచి తప్పించాలి. దానికి ప్రతిగా క్రిస్మస్ కు విడుదల కావాల్సిన తమ సినిమాలను ఆ డేట్ నుండి తప్పిస్తారు.
అందుకే భీష్మ, ప్రతిరోజూ పండగే చిత్రాల రిలీజ్ డేట్ లను ఇంతవరకూ ప్రకటించలేదు. కానీ నిన్న సురేష్ బాబు ఈ ఆఫర్ ను తిరస్కరించాడట. సంక్రాంతికే వెంకీ మామను దించాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించేసారు.