ఈ మధ్య కాలంలో బాగా సందడి చేసిన మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్. లాక్ డౌన్ కు ముందు విడుదలైన ఈ చిత్రం కేరళలో భీభత్సమైన విజయాన్ని సాధించింది. ఇద్దరు మనుషుల మధ్య వచ్చిన ఇగో సమస్యల వల్ల వాళ్ళ జీవితాలు ఏ టర్న్ తీసుకున్నాయనే ప్రధాన పాయింట్ మీద ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల వాళ్ళు అమితమైన ఆసక్తిని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది.
అప్పటినుండి ఈ రీమేక్ పై బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వివిధ హీరోల పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రానా, రవితేజ ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపించారని తెలుస్తోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి తీసుకొస్తే సినిమా చేయడానికి సిద్ధమని వారు ప్రకటించారట.
అయితే మరి సమర్ధవంతంగా ఆ మలయాళ సినిమాకు మార్పులు చేయగల దర్శకుడు ఎవరు? ఆ వేటలోనే ఉంది సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. అయితే సుధీర్ వర్మ పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది. స్వామిరారా తో దర్శకుడిగా మారిన సుధీర్ వర్మ ఆ తర్వాత సరైన విజయాన్ని అందుకున్నది లేదు. మరి ఈ చిత్రంతోనైనా సుధీర్ దర్శకుడిగా హిట్ అందుకుంటాడా అన్నది వేచి చూడాలి.