ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించారని, తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చిందని బాలు తనయుడు చరణ్ స్టెట్మెంట్ ఇచ్చారంటూ ఉదయం ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని, నాన్న ఆరోగ్యంపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.
`నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులని సంప్రదించిన తరువాత ఎప్పటికప్పుడు ఆ విషయాల్ని మీతో పంచుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నాన్నగారి ఆరోగ్యం గురించి మొట్టమొదట సమాచారం పొందే ఏకైక వ్యక్తిని నేనే.
ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కోవిడ్ నెగెటివ్ వచ్చినట్టు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అది పాజిటివా నెగెటివా అన్నది పక్కన పెడితే ఆయన ఆరోగ్యం విషయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆరోగ్యం నిలకడగా వుంది. దయచేసి అసత్య ప్రచారాలు ఆపండి. సాయంత్రం వైద్యులతో చర్చించిన తరువాత నేనే అప్డేట్ ఇస్తా` అన్నారు. ఎస్పీచరణ్.