స్వర్గీయ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనని పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కేంద్రం ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్ని ప్రకటించి గౌరవించడంతో సినీ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ప్రధాన భారతీయ భాషల్లో తన మధురమైన గాత్రంతతో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు బాలు. ఆయన తరహాలో పాటలు పాడగల మధుర గాయకులు లేరు.. రారు అన్నది జగమెరిగిన సత్యం. ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచిపోయాయి. పాటకే వన్నె తెచ్చిన ఆయన మధుర గాత్రంలో తడిసి ఓలలాడని వారు లేరు.
పండితుల నుంచి పామరుల వరకు తన గాన మాధుర్యంతో అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు. నెల్లూరులో ఓ సామన్య కుటుంబంలో పుట్టిన ఆయన సంగీత సామ్రాజ్యంలో సామ్రాట్గా వెలుగొంది కోట్లాది మంది చేత జేజేలు అందుకున్నారు. 6 జాతీయ పురస్కారాలతో పాటు 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వున్నాయి. బాలు తన గాత్రంతో మాత్రమే కాకుండా డబ్బింగ్, సంగీతంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ, స్టూడియో అధినేతగా, నిర్మాతగా తనదైన మార్కుని చూపించి ఆకట్టుకున్నారు.