వెండితెరపై ఓ రేంజ్లో ఆకట్టుకున్న నటీనటులు, హీరోలు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు డిజిటల్ బాట పట్టారు. వెబ్ సిరీస్లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సల్మాన్ఖాన్ హీరోయిన్ చేరబోతోంది. గత కొంత కాలంగా కెరీర్ పరంగా హిట్లని సొంతం చేసుకోలేకపోతోంది సొనాక్షిసిన్హా.
తాజాగా సల్మాన్ఖాన్తో కలిసి `దబాంగ్-3`లో నటించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై సొనాక్షి భారీ అంచనాలే పెట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే మళ్లీ పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకునే వీలుండదని భావించింది. కానీ ఆమె ఆశలపై `దబాంగ్-3` ఫలితం నీళ్లు చల్లింది. దీంతో ఆలోచనలో పడ్డ సోనాక్షి సిన్హా కొత్త దారిని ఎంచుకుంటోంది.
డిజిటల్ ప్రపంచం విస్తరిస్తున్న నేపథ్యంలో వెబ్ సిరీస్ల ప్రభావం పెరిగిపోతోంది. ఇదే తనకు సరైన సమయమని భావించి రీమా గగ్తీ క్రైమ్ థ్రిల్లర్తో వెబ్ దునియాలోకి ఎంటరవుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ వెబ్ సిరీస్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్స్టా ద్వారా సోనాక్షి వెల్లడించింది. `కొత్త ప్రారంభం.అమెజాన్ కోసం చేస్తున్న న్యూ సిరీస్ని ప్రారంభిస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్గా వుంది` అని ఓ ఫొటోని షేర్ చేసింది.