`నరసింహా` తరువాత రమ్యకృష్ణకు అంతకు మించిన గుర్తింపును తెచ్చిపెట్టిన చిత్రం `బాహుబలి`. ఈ సినిమా తరువాత ఆమె రేంజే మారిపోయింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా గౌతమ్ మీనన్ రూపొందించిన `క్వీన్` వెబ్ సిరీస్లో నటించింది. దీనితో తెలుగులో మూడు క్రేజీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. కృష్ణవంశీ కొంత విరామం తరువాత మారాఠీ చిత్రం `నటసమ్రాట్` ఆధారంగా `రంగమార్తాండ` పేరుతో ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
ఇందులోని ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. దీనికితోడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న `ఫైటర్`, తన తనయుడు ఆకాష్ పూరితో నిర్మిస్తున్న `రొమాంటిక్` చిత్రాల్లో నటిస్తోంది. అయితే నటిగా మంచి డిమాండ్ వున్న రమ్యకృష్ణ దర్శకుడు పూరి జగన్నాథ్ కోసం రాజీపడినట్టు తెలుస్తోంది. `బాహుబలి` తరువాత రమ్యకృష్ణ రోజుకు 6 నుంచి 10 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే పూరి సినిమాలు కావడంతో ఫైటర్, రొమాంటిక్ చిత్రాలకు తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.
రెగ్యులర్గా రోజుకి 6 నుంచి 10 లక్షలు వసూలు చేసే రమ్యకృష్ణ తాజాగా పూరి చిత్రాలకు మాత్రం అందులో సగం మాత్రమే తీసుకుంటోందని ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది. రమ్య పారితోషికం విషయంలో రాజీపడటానికి కారణం విజయ్ దేవరకొండ నటించనున్న` ఫైటర్` చిత్రంలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా సాగుతుందట. ఆ కారణంగానే పూరి సినిమాల విషయంలో రమ్యకృష్ణ రాజీపడ్డారని సినీ వర్గాలు చెబుతున్నాయి.