భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన గుణశేఖర్ తన నెక్స్ట్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. మహాభారతంలో ఆది పర్వంలో అభిజ్ఞాన శాకుంతలం కథావస్తువుగా ఈ సినిమా తెరకెక్కనుంది. సమంత శకుంతలగా నటించనుండగా దేవ్ మీనన్ దుశ్యంత మహారాజు పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు నటి ఈషా రెబ్బ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషించనుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో తెలుగు నుండి ప్యాన్ ఇండియా సినిమాలు వస్తుండగా దానికి శాకుంతలం జత కానుంది.
గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శాకుంతలం చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో రానుంది.