![లక్కంటే బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్దే! లక్కంటే బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్దే!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/04/shahid-kapoor-in-ala-vaikuntapuramuloo-hindi-remeke.jpg)
బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ లక్కు మామూలుగా లేదు. 7 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్లో వున్న ఈ హీరోని టాలీవుడ్ సినిమా 30 కోట్ల హీరోని చేసింది. అదే `అర్జున్రెడ్డి`. ఈ చిత్రాన్ని హిందీలో `కబీర్సింగ్` పేరుతో సందీప్ వంగ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాంట్రవర్సీలతో పాటు సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం రాత్రికి రాత్రే షాహీద్కపూర్ని 30 కోట్లు డిమాండ్ చేసే హీరోల లిస్ట్లో చేర్చింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో షాహీద్ కపూర్ పారితోషికం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. 30 కోట్ల డీల్కు ఓకే అంటే మాత్రమే సినిమా అంగీకరిస్తున్నాడు. తాజాగా తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన `జెర్సీ` చిత్రాన్ని ఇదే హీరోతో అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. దీని కారణంగా షాహీద్ కు ముఖానికి గాయాలయ్యాయి కూడా.
ఇదిలా వుంటే షాహీద్కపూర్ చేతికి మరో ఇండస్ట్రీ హిట్ లభించినట్టు తెలిసింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం `అల వైకుంఠపురములో`. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా నిలిచింది. అశ్విన్రెడ్డి అనే బాలీవుడ్ నిర్మాత ఈ చిత్ర బాలీవుడ్ రీమేక్ హక్కుల్ని భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే బన్నీ, లేదా త్రివిక్రమ్ నుంచి అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.