తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నసమంత గత కొంత కాలంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రచారానికి దూరంగా ఆమె చేస్తున్నసేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి మంచి జరుగుతోంది. సమంత కెరీర్ ప్రారంభంలో ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ ఎంజీఓని రన్ చేస్తున్నారు. దీని ద్వారా ఆపదలో వున్న వారిని ఆదుకుంటూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గుండె సమస్యతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకుని సమంత వారికి ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఆపరేషన్లు చేయించారు. వారంతా తిరిగి ఆరోగ్యంగా వున్నారు. వారితో కలిసి సమంత కొంత సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా తీయించుకున్న ఫొటోలని సోషల్ మీడియా ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారామె. ఈ ఫొటోలతో పాటు గర్భిణులు తీసుకోవాల్సి జాగ్రత్తల్ని సూచిస్తూ ఓ పోస్ట్ని పెట్టారు. పిల్లల్లో మానసిక ఎదుగుదల, గుండె సంబంధిత రుగ్మతలు కలగకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి నివారణ ఒక్కటే మార్గమని ప్రచారం చేస్తున్నారు.
ఆపరేషన్ పూర్తయి ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారుల గురించి స్పందిస్తూ `దైర్యంగా గుండె జబ్బుతో పోరాడి నిలిచిన ధైర్య వంతులు వీళ్లు. వీరి నవ్వులు చూస్తుంటే ఆనందంగా వుంది. సమస్యల్ని తెలుసుకోవడంలో నాకు ప్రత్యూష ఫౌండేషన్ సహాయపడుతోంది. దాని వల్లే రొంత మందికి సహయపడగలుగుతున్నాను` అని సమంత వెల్లడించింది. ఇన్స్టాలో సమంత పెట్టిన పోస్ట్ పలువురిని ఆకట్టుకుంటోంది. వెండి తెరపైనే కాదు రియల్ లైఫ్లోనూ సమంత హీరోయినే అంటూ అంతా అభినందిస్తున్నారు.