సమంత గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీమెన్ సీజన్ 2` త్వరలో రిలీజ్ కాబోతోంది. రాజ్ ఎన్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ డ్రామాలో సమంత తొలిసారి నెగెటివ్ పాత్రలో పాకిస్థానీ టెర్రరిస్టుగా నటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ కోసం చాలా వరకు బారియర్స్ని బ్రేక్ చేశానని సమంత ఇప్పటికే చెప్పేయడంతో ఈ సిరీస్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా వుంటే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మెయిన్ లీడ్లో ఓ ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కనుందంటూ వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి తన గడిచిపోయిన జీవితంలోని మధుర జ్ఞాపకాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందట.
ఇందులో రాఘవేద్రుడి కి జోడీగా ముగ్గురు కథానాయికలు నటించనున్నారట. అందులో రమ్యకృష్ణ, శ్రియలని ఇప్పటికే ఫైనల్ చేశారు. మూడో హీరోయిన్గా మెయిన్ లీడ్ పాత్ర కోసం సమంతని తనికెళ్ల భరణి సంప్రదించారట. ఈ మూవీలో నటించడానికి సామ్ ఆసక్తిని చూపించలేదని, తనికెళ్ల భరణి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించిందని తెలిసింది.